అందరూ అనుకోవచ్చు సినిమాకూడా ఇంకా రిలీజ్ కాలేదు అప్పుడే రివ్యు ఏమిటని. కానీ ఇంతకు ముందే నేని చిత్రాన్ని తమిళంలో చూసాను. నిజంగా సినిమాలను ఆదరించేవారు తప్పక చూడవలసిన సినిమా ఇది. 'మదరాసపట్టినం' దీని మాతృక. ఈ సినిమా చూశాక మన వాళ్ళు మాత్రం ఎందుకు ఇలాంటి సినిమా తీయట్లేదనే ఆవేదన ఖచ్చితంగా కలుగుతుంది. అంతటి బావోద్వేగానికి గురిచేసే ప్రేమకథా చిత్రమిది.
కథ:
కథలోకి వస్తే 1947లో స్వాతంత్రోద్యమ నేపధ్యంలో తమిళనాడులోని మద్రాసు పట్నంలో ఓ ఆంగ్లేయ యువతికి, ఓ సామాన్య తమిళ అబ్బాయిల మధ్య జరిగే ప్రేమ కథ ఇది. హీరో 'వరుడు' సినిమా విలన్ ఆర్య, ఇతడు ఇందులో ఒక దోబి. హీరోయిన్ ఎమి జాక్సన్ ఆంగ్ల గవర్నర్ జనరల్ యొక్క కూతురుగా నటించారు. కేవలం సినిమా నేపధ్యం మాత్రమే స్వాతంత్రోద్యమం, దాని తాలూకా ఛాయలు మరి అతిగా పడకుండా జాగ్రత్త పడ్డాడు దర్శకుడు. మొదటి సీనే లండనులో వ్యాధితో బాధపడుతూ, జీవితపు చివరి దశలో వున్న ఓ వ్రుద్ధురాలు తన ప్రేమ స్మృతులను మననం చేసుకోవడంతో మొదలవుతుంది. ఆ తరువాత ఆమె భారతదేశంలో తనకో బాధ్యత మిగులుందని తన మనవరాలితో ప్రయాణమవుతుంది. కొద్దిగా ఈ వృద్ధురాలి కథ, మరో ప్రక్క 1947 లో స్వాతంత్రోద్యమ కాలపు అందమైన ఓ ప్రేమ కథ జరుగుతుంది. అంటే ఆ వృద్ధురాలు తన పయనంలో నేటి చెన్నైని ఆనాటి మదరాస పట్నంతో పోల్చి చూడడంతో ఆ కాలం నాటి ఒక్కొక సీనుతో అసలు కథ మొదలవుతుంది.
1947 నాటి కథ, మద్రాస్(చెన్నై) సెంట్రల్ రైల్వే స్టేషను ప్రక్కన ఓ పెద్ద దోబిల అంతా నెలకొని వుండే ఓ ప్రదేశం నెలకొని వుంటుంది. హీరో ఒక దోబి అని ముందే చెప్పుకున్నాం. నాసర్ ఒక మల్లు యుద్ధ శిక్షకుడు ఆ దోబి యువకులందరికీ, బాలా సింగ్ దోబిలందరికి నాయకుడు. వీరిరువురు ఆ గ్రామ పెద్దలు. అలెక్స్ ఓ నెల్ ఈయనే కథకు ప్రతినాయకుడు, దుష్ట బ్రిటిషు పోలిస్ ఆఫీసర్,అహంకారి. హీరోయినును అతిగా ప్రేమిస్తాడు. చెన్నై యొక్క అందాలను చూపించేందుకు గానూ గైడుగా ఆర్యతో తిరగడంతో, ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారుతుంది. ఇంతలో ఆ దోబిల నివాస స్థలంలో ఏదో బ్రిటిషు వారి స్థావరం నిర్మించేందుకు ఆదేశాలు జారిచేస్తారు. అసలే హీరోయిన్ ఆర్యతో చనువుగా ఉండడంతో కోపంతో ఉన్న ప్రతి నాయకుడు ఆ ఆదేశాలు మరింత బలోపేతంగా మార్చే విధంగా చూస్తాడు. ఎప్పుడూ ఆ దోబిల పరిసరాలలోనే ఆర్యా కోసమే ఉండే హీరోయినును చూసి విలన్ మరింత కోపోద్రిక్తుడవుతాడు.అప్పుడు హీరోయిన్ ఆ దోబిల సంప్రదాయ ఆటైనటు వంటి కుస్తీ పోటీలలో ఆర్యాతో తలపడి గెలిస్తే మరెప్పుడు ఆ పరిసరాలకు రానని, ఓడితే వాళ్లకు ఆ ప్రాంతం తిరిగి ఇవ్వవలసినదిగా కోరుతుంది. ఈ పోటీలో ఆర్య గెలిచి తన ప్రాంతాన్ని కాపాడుకుంటాడు. ఆర్య,ఎమి జాక్సన్ ల మధ్య ప్రేమ మరింత ఉద్రితమవుతుంది. ఊరి పెద్దలంతా వాళ్ళ సంప్రదాయం ప్రకారం పెళ్లి సంబంధానికి వెళతారు. ఎమి జాక్సన్ తండ్రి అయిన గవర్నర్ అంగీకరించడు. ఒక ప్రక్క స్వాతంత్రోద్యమం తీవ్ర స్థాయిలో ఉండడంతో ఆఖరికి ఆంగ్లేయులు ఆగస్ట్ 15,1947 స్వాతంత్ర్యాన్ని ప్రకటిస్తారు. దానితో తెల్లవారేలోపు గవర్నర్ ఎమి జాక్సన్ తో పరారవ్వాలను కుంటాడు. తెల్లవారితే స్వాతంత్ర్యం. ఆఖరికి ఆ రోజున ఆ ప్రేమికుల జంటైన ఆర్య ,ఎమి జాక్సన్ కలిసారా? ఆ రోజు అసలు ఏమయింది? మరి ప్రస్తుత కథలో ఆ వృద్ధురాలు ఎవరు? ఆమెకు ఈ కథకు గల సంబంధం ఏమిటి?ఆమె ఎందుకు చెన్నై వచ్చినట్లు? ఆమె బాధ్యత ఏమిటి ? ఆమె వచ్చిన పని ముగిసిందా లేదా అనేదే మిగతా కథ..
చిత్ర బలం:
- నటుల నటన, దర్శకుడు పాత్రలు మలిచిన తీరు.
- ముందుగా నిర్మాతను అభినందించాలి. ఎందుకంటే దర్శకుడు విజయ్ ఖాతాలో రెండు ఫ్లాప్ చిత్రాలు ఉన్నప్పటికీ ధైర్యంగా నిర్మాణానికి అంగీకరించినందుకు. ఆ దర్శకుడు ఎవరో కాదు మరి 'నాన్న' చిత్రం ఆయనదే.
- ఎన్ని ఉన్నప్పటికిని ఈ చిత్రాన్ని దృశ్య కావ్యంగా మలచింది సినిమాటోగ్రాఫర్ నిరావ్ షా, ఆర్ట్ డైరెక్టర్ సెల్వ కుమార్ . వీళ్ళకే ఆ ఘనతంతా.
- G.V.ప్రకాష్ నేపధ్య సంగీతం బాగుంది, సంగీతం మరీనూ. తెలుగులో బహుశా పోయిన నెల 25 న అనుకుంటా ఆడియో విడుదల అయింది. ఇందులో రూప్ కుమార్, సైంధవి పాడిన 'పూలు పూయు తరుణం' పాట చాలా బాగుంది. ముందు నేను భయపడ్డాను మన వాళ్లు అనువాదపు పాటలు కదా అని ఎక్కడ పాడు చేస్తారో అని.
చిత్ర బలహీనత:
- కొద్దిగా 'టైటానిక్' ను తలపించడం.
- నా కెందుకో దీనిని బాగా చూస్తే కొద్దిగా 'లగాన్' సీన్లు కూడా స్పూరణకు వచ్చాయి. అయితే అందులో క్రికెటు, ఇందులో కుస్తీ అది కూడా ఒక సీను మాత్రమే అనుకోండి. అయితే అది పూర్తిగా దేశభక్తి చిత్రమైతే, ఇది పూర్తిగా ప్రేమకథా చిత్రం.
- చారిత్రాత్మక చిత్రం కనుక అనువాదంలో 'నేటివిటీ' సమస్య ఖచ్చితంగా తలెత్తుతుంది. కాని నా ఉద్దేశ్యంలో కథ బలమైనది అయితే అవేమి మనకి ఇబ్బంది కలిగించవు. కనుక నిస్సంకోచంగా చూడవచ్చు.







0 comments:
Post a Comment